శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా రాయలవారిని గూర్చి పద్యం వ్రాయాలని ఆశ గలింగింది, శ్రీ కొడిహళ్ళి మురళీ మోహన్ గారి ప్రోత్సాహం మీద.
ఏమి రాయాలా అని ………… తరువాత
తెనాలి రామకృష్ణుని పద్యం లో రాయలు వారు చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన విషయం గూర్చి చెబుదామని ఆలోచన వచ్చింది.
తెనాలి రామకృషుల వారు నంది తిమ్మన గూర్చి ప్రశంసగా చెప్పిన పద్యం ఇది:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
రాయల మార్పు చేసిన పద్యం ఇది:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాక ధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
దీని గూర్చి మరింత వివరణ ఇక్కడ చూడండి.
సరే ఎలాగో నాలుగో పాదం కూర్చాను :”గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే”
అని.
పై మూడు పాదములకు గణములు కూర్చిన తరువాత పద్యం ఇదీ:
ఎందుకైనా మంచిదని పద్యాన్ని తీసుకువెళ్లి కామేశ్వర రావు గారికి చూపించాను, వారు చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన పద్యం ఇది:
జనజీవనసుఖమయ పా
లనమునను సుకవులకైతలను రాజకవీ!
గనుగొన సులువుగనిలను,గ
గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే!
ఏమిటీ, కామేశ్వర రావు గారూ మార్పు చేయక ముందు పద్యం గనబడతం లేదు అంటారా? అదే గగనం అంటే.
సరే మొత్తానికి పద్యములైతే కట్టాను, చాలా రోజుల తరువాత, అనుకున్న పని, అందులోనూ శక్తికి మించినది, పూర్తిజేయగలిగాను,చేతనైనంతలో. గురుకృప, మిత్రలాభం తోడై. ఆ పద్యాలు ఇక్కడ చూడవచ్చు.
భైరవభట్ల వారి మార్పు చూసి చూడగానే – నా నోట వచ్చిన మాట ” మా కొలది జానపదులకు..”
పద్యాన్ని పూర్తి చేస్తే:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ! గనగ, శ్రీకామేశా!